సావరిన్ గోల్డ్ బాండ్లు: పెట్టుబడిదారులకు కాసుల వర్షం

  • సావరిన్ గోల్డ్ బాండ్ల ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
  • 2019-20 సిరీస్ VII యూనిట్‌కు రూ. 15,275గా ధర ఖరారు
  • పెట్టుబడిదారులకు 300 శాతానికి పైగా భారీ లాభాలు
  • లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ. 4 లక్షలకు పైగా వృద్ధి
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీపీ) పెట్టుబడిదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీపి కబురు అందించింది. 2019-20 సిరీస్-VII బాండ్ల ముందస్తు విత్‌ డ్రా (ప్రీమెచ్యూర్ రిడంప్షన్) ధరను యూనిట్‌కు రూ. 15,275గా ఖరారు చేసింది. ప్రస్తుతం పసిడి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండటంతో, ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో భారీ లాభాలు దక్కనున్నాయి.

2019 డిసెంబర్ 10న జారీ చేసిన ఈ బాండ్లకు ఐదేళ్ల కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం ముందస్తుగా నగదుగా మార్చుకునే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. ఈ బాండ్లు జారీ చేసిన సమయంలో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి గ్రాము రూ. 3,745కే లభించాయి. ప్రస్తుత రిడంప్షన్ ధర ప్రకారం చూస్తే, ప్రతి గ్రాముపై సుమారు రూ. 11,530 మేర లాభం చేకూరుతోంది. ఇది దాదాపు 308 శాతం రాబడికి సమానం. ఉదాహరణకు, అప్పట్లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి విలువ ప్రస్తుతం సుమారు రూ. 4.08 లక్షలకు చేరుకుంది. దీనికి అదనంగా ఏటా లభించే 2.5 శాతం వడ్డీ ప్రయోజనం కూడా ఇన్వెస్టర్లకు దక్కుతుంది.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించిన గత మూడు పనిదినాల (జూన్ 5, 8, 9) ముగింపు ధరల సగటు ఆధారంగా ఆర్‌బీఐ ఈ రిడంప్షన్ ధరను నిర్ణయించింది.

999 స్వచ్ఛత కలిగిన బంగారం సగటు ధరను ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు. భౌతిక బంగారంతో పోలిస్తే ఎటువంటి నిల్వ సమస్యలు, భద్రతాపరమైన ఆందోళనలు లేని సావరీన్ గోల్డ్ బాండ్లను ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ జారీ చేస్తుంది. ఈ బాండ్ల మొత్తం కాలపరిమితి 8 ఏళ్లు కాగా, ఐదేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. బాండ్లను మెచ్యూరిటీ వరకు (8 ఏళ్లు) కొనసాగిస్తే మూలధన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ముందస్తుగా విత్‌డ్రా చేసుకోవాలనుకునే వారు సంబంధిత బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా డిపాజిటరీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.

Sovereign Gold Bonds
RBI
Gold Investment Returns
IBJA Gold Rates
Premature Redemption Price

More Telugu News